హైదరాబాద్ నగర శివారు మోకిలాలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. యువతి స్నానం చేసే బకెట్లో గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోశారని.. అవి కూడా నీళ్లే అని భావించి ఒంటిపై పోసుకోవటంతో తీవ్ర గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే.. కాలేజీలో ఓ వేడుక జరిగిందని.. ఇందులో భాగంగా విద్యార్థులు రంగు నీళ్లతో ఆడుకుంటుండగా.. ఓ బకెట్లో యాసిడ్ పోశారని.. వాటిని చల్లటం వల్లే అమ్మాయికి గాయాలయ్యాయని మరికొన్ని వార్తలు బయటికి వచ్చాయి. అయితే.. పోలీసులు ఇంకా వేరే విషయాన్ని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే.. ఇవన్నీ ఏమీ కాదు.. అసలు ఆ అమ్మాయిపై యాసిడ్ అటాకే జరగలేదు.. కేవటం వేడి నీటి వల్లే ఆ అమ్మాయికి గాయాలయ్యాయంటూ.. యూనివర్సిటీ వీసీ గణేష్ బిస్ట్ ఇచ్చారు.
మే 15వ తేదీన అమ్మాయికి గాయాలయ్యాయని.. యూనివర్సిటీ వసతి గృహంలోనే ప్రాథమిక చికిత్స చేసి.. ఆస్పత్రికి తరలించామని వీసీ గణేష్ అసలు విషయం చెప్పుకొచ్చారు. విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వీసీ వివరించారు. హాస్టల్లోని అన్ని గదుల్లోనూ పటిష్ఠ భద్రత ఉందని తెలిపారు. అయితే.. విద్యార్థిని బుధవారం (మే 15న) రాత్రి 7.20 గంటలకు తన గది నుంచి బయటకు వచ్చి ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పిందని తెలిపారు.
ఆమె చెప్పిన వెంటనే ఆమెకు తమ క్లినిక్లో చికిత్స అందించామని.. ఒంటిపై 40శాతం కాలిన గాయాలైనట్టు గుర్తించామన్నారు. గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఈ ఘటనకు సంబంధించి కారిడార్లో సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులకు అందించామని.. క్లూస్ టీం కూడా కొన్ని వస్తువులు తీసుకెళ్లారన్నారు. హౌస్ కీపింగ్ వాళ్లు కూడా విద్యార్థులు గదిలో ఉన్నప్పుడే వెళ్తారని చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగిందనేది పోలీసులు నిర్ధారిస్తారని వీసీ గణేశ్ చెప్పుకొచ్చారు.
అయితే.. పోలీసులు చెప్పేది ఇంకోలా ఉండటం గమనార్హం. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు శంకర్పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం బాధిత విద్యార్థిని స్నానం చేసేందుకని బాత్రూంకి వెళ్లి అక్కడ బకెట్లో ఉన్న నీటిని ఉపయోగించింది. ఒక్కసారిగా కేకలు వేయటంతో.. తోటి విద్యార్థినులు, యాజమాన్యం కలిసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. హౌస్ కీపింగ్ సిబ్బంది యాసిడ్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేసిన అనంతరం.. మిగిలిన నీటిని పారబోయకుండా బకెట్లోనే ఉంచి మర్చిపోయారని.. సరిగ్గా అదే సమయానికి విద్యార్థిని స్నానానికి వెళ్లి.. ఆ బకెట్లో ఉన్న నీటినే వాడటంతో ఒంటిపై గాయాలైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇందులో ఏది నిజం.. ఏ అబద్దమన్నది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa