కనీ, పెంచిన అమ్మ కాలు జారిపడిపోయి కన్నుమూసింది. అంత్యక్రియలు చేయాల్సిన కుమారులు, కుమార్తెలు ఆస్తి పంపకాల కోసం గొడవలు పడుతున్నారు. రెండు రోజులుగా ఆ తల్లి మృతదేహం ఫ్రీజర్లోనే ఉంది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా అలాగే ఉంచడం ఊరికి కూడా మంచిది కాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల విషయం తెలితే గానీ అంత్యక్రియలు చేయలేమని పెద్దకుమారుడు, కోడళ్లు తేల్చి చెబుతున్నారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
కందులవారి గూడెంకి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వెంకటరెడ్డి కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. చిన్న కుమారుడు కూడా గతంలోనే మృతి చెందాడు. లక్ష్మమ్మ నేరేడుచర్లలోని తన చిన్నకుమార్తె వద్ద ఉంటున్నారు. లక్ష్మమ్మ కొన్ని రోజుల కిందట చిన్నకుమార్తె ఇంట్లో కాలుజారి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను మిర్యాలగూడలోనే ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చారు. రెండు రోజుల కిందట ఆమె మృతి చెందారు. లక్ష్మమ్మ దగ్గర రూ. 21 లక్షలు ఉండగా, 6 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చయ్యాయని బంధువులు చెబుతున్నారు. మిగిలిన 15 లక్షల రూపాయలను సోదరుడికి ఇచ్చానని ఆమె చెబుతున్నారు. లక్ష్మమ్మ వద్ద 20 తులాల బంగారం ఉండగా ముగ్గురు కుమార్తెలకు పంపకాలు జరిపారు.
ఇక అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధం కాగా.. ఆస్తి పంపకాలు కొలిక్కి వస్తేగానీ అంత్యక్రియలు చేయబోనని పెద్దకుమారుడు మొండికేశారు. తన తల్లి వద్ద రూ. 50 లక్షల విలువైన ఆస్తి, 50 తులాల బంగారం ఉందని.. ఆస్తి పత్రాలు, బంగారం అన్నీ తీసుకొని చిన్నకుమార్తె వద్దకు వెళ్లిపోయిందని అతడు చెబుతున్నాడు. గ్రామంలో తాను సాగు చేసుకుంటున్న ఎకరం పొలం కూడా తల్లి పేరు మీదే ఉందని వాపోయాడు. ఆస్తి పంపకాలు జరిగి, ఆస్తి పత్రాలు తనకు ఇస్తేగానీ అంత్యక్రియలు చేసేది లేదని పెద్దకుమారుడు, కోడలు అంటున్నాడు. రెండు రోజులుగా లక్ష్మమ్మ మృతదేహం ఫ్రీజర్లోనే ఉంది. కుమార్తెలు, చిన్నకోడలు, పెద్దకుమారుడు, పెద్దకోడలు మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు కొనసాగుతున్నాయి. గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టుకున్నా ఓ కొలిక్కి రాలేదు. కన్నతల్లి చనిపోతే బిడ్డలు దహన సంస్కారాలు చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్న తీరు మానవతావాదులను ఆవేదనకు గురిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa