ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 10:32 PM

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 26 వేల 27 స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. కిందటేడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ. 2023 సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు చూస్తే 22,632 యూనిట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. 2022 సంవత్సరంలో 24,866 ఇళ్లతో పోలిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలిపింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నా కూడా కిందటేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ జరగడం విశేషం.


హైదరాబాద్, రంగారెడ్డి సహా మేడ్చల్- మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కువగా ఇళ్ల నిర్మాణాల జరుగుతున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఇక్కడ కిందటి నెలలో 6578 గృహాల రిజిస్ట్రేషన్లు ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ.


ఇళ్ల కొనుగోలులో హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే విస్తీర్ణమే కీలకంగా ఉంది. గతేడాది, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలతో పోల్చి చూసినట్లయితే 3000 అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లు 2 నుంచి 4 శాతానికి పెరిగాయి. 2 వేల నుంచి 3 వేల విస్తీర్ణం లోపు ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 8 నుంచి 11 శాతానికి ఎగబాకాయి. ఇక 1000 నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్లు 69 శాతం నుంచి 70 శాతానికి పెరగడం విశేషం. 1000 లోపు ఇళ్ల విస్తీర్ణం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 20 నుంచి 16 శాతానికి పడిపోయాయి.


>> ఇళ్ల రిజిస్ట్రేషన్లలో సంవత్సర కాలంలో కొన్ని మార్పులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నెలలో మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా రిజిస్ట్రేషన్స్ వాటా 46 శాతంగా ఉండగా.. ఇప్పుడు 39 శాతానికి తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇదే సమయంలో 39 నుంచి 45 శాతానికి రిజిస్ట్రేషన్లు పెరిగాయి.


>> ఇంటి రిజిస్ట్రేషన్ విలువ రూ. 50 లక్షల్లోపు ఉన్న ఇళ్లు గత 4 నెలల కాలంలో కిందటేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 4 శాతం తగ్గుముఖం పట్టాయి. 2023 సంవత్సరంలో 16,060 ఇళ్లు రిజిస్ట్రేషన్ ఉంటే.. ఈసారి మాత్రం 15,419 జరిగాయి. అయినప్పటికీ మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటానే ఎక్కువ.


రూ. 50 లక్షల నుంచి రూ. కోటి లోపల విలువ ఉన్న ఇళ్లు 2023లో 4512 రిజిస్టేషన్ జరిగితే.. 2024లో 6649 యూనిట్లకు అంటే ఏకంగా 47 శాతం పెరిగాయి. రూ. కోటిపైన విలువ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు దాదాపు రెట్టింపయ్యాయి. 2023లో 2060 ఉంటే.. ఈసారి 3959 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. పెరుగుదల 92 శాతం వరకు ఉంది.ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 1142 యూనిట్లకు పెరిగాయి. అంటే 172 శాతం మేర పెరిగాయన్నమాట.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa