ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 07:50 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. అయితే.. మేడ్చల్ జిల్లా కుత్భుల్లాపూర్ పరిధి సుచిత్రలోని ఓ భూమి వివాదం విషయంలో.. మల్లారెడ్డికి లక్ష్మణ్‌కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ భూమి నాదంటే నాదని ఒకరికొకరు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు మల్లారెడ్డి సవాల్ విసిరారు. సుచిత్రలోని తన భూమి పత్రాలు ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమంటూ మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. మరి ఆ భూ పత్రాలు సరైనవి అయితే.. రాజీనామా చేసేందుకు సిద్ధమా అని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు.


తనది తప్పు అని నిరూపిస్తే అన్నీ వదిలేసి వెళ్లిపోతానని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లవే అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ వ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి, సంబంధిత కలెక్టర్లను కలుస్తానని.. తన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మే 20న సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకున్నట్టు తెలిపారు.


ఇదిలా ఉంటే.. సుచిత్రలోని వివాదాస్పద భూమిని కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్‌లోని వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తున్న భూమి దగ్గరకు వచ్చారు మల్లారెడ్డితో పాటు, భూమి తమదేనని వాదిస్తున్న 15 మంది కూడా వచ్చారు. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్‌ను ఇరు వర్గాల వారు అధికారులకు ఇచ్చారు. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు భారీగా మోహరించారు. కాగా.. ఇదే భూమి విషయంలో శనివారం ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మల్లారెడ్డి మీద, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa