బీఆర్ఎస్ కార్య నిర్వహాక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొనగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండే రెండు ప్రధాన కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. బీఆఱ్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయి వరకు చెప్పుకోలేకపోవటం ఒక కారణమైతే.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన రెండో తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే.. అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమాఫీ విషయంలో రోజుకో మాట మార్చుతోందని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు.. వారు నియామకపత్రాలు ఇచ్చి వారే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సొంత డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డికి ముందు నుంచే అలవాటే అని విమర్శించారు. పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కేటీఆర్ వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. బీజేపీ వాళ్లు అయోధ్య గుడికట్టి ఓట్లడుగుతున్నారని, అలాగైతే తాము కూడా యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయాలంటే.. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డి స్వయంకృషితో పైకి వచ్చాడని.. అతను గెలిస్తే యువత తరపున చట్టసభల్లో గొంతెత్తుతారని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa