నిరుద్యోగులు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాలు, తండాల్లో కొత్త పాఠశాలలను తెరిపించాలంటే పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల అవసరం ఉందని రేవంత్ తెలిపారు. అందుకోసమే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. త్వరలోనే.. 11 వేలకు పైచిలుకు ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ జరగబోతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా నడిచిందని.. సర్కారు పాఠశాలలను మూసివేసిందని మండిపడ్డారు. అయితే.. ఇకపైన సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయటానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు.
వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మారుమూల గ్రామాలు, తండాల్లో ప్రభుత్వ పాఠశాలలను తెరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల్లో పాఠశాలలు నెలకొల్పడం ద్వారా ఆదివాసీలు, గిరిజనులు, దళితులకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. విద్యాశాఖకు ప్రభుత్వం చేసే ఖర్చు భవిష్యత్తు తరాలకు పెట్టుబడి లాంటిదన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సగటున రూ. 80 వేల చొప్పున ఖర్చుపెడుతుందని.. ఈ ఖర్చులో అధికశాతం టీచర్ల వేతనాలకే వెళ్తుందన్నారు. అయినా.. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు రేవంత్ రెడ్డి.
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడంలేదనే వాదనను దృష్టిలో పెట్టుకుని ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలను చేర్పించకపోతే పాఠశాల మూతబడుతుందనే అంశాన్ని తల్లిదండ్రులకు అర్థం చేయిస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిస్తే తల్లిదండ్రులు కూడా పంపడానికి ఆసక్తి చూపుతారని అన్నారు.
ప్రతి విద్యార్థికీ అమ్మఒడే తొలి పాఠశాల అని గుర్తుచేసిన సీఎం రేవంత్... ఇటీవల రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించడంతో వారు అమ్మ ఒడికి దూరమవుతున్నారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయంటూ ఇటీవల ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందని గుర్తుచేశారు. ఇది ఒక సామాజిక సమస్యగా మారే ప్రమాదముందన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తే కాస్త మార్పు వస్తుందని, ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని అన్నారు. గ్రామీణ పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa