కేంద్ర మంత్రిగా తెలంగాణ సమస్యలపై దృష్టి పెడతానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా కార్యక్రమాలు చేయాలని తనకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పిన మాటలను రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. తనకు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు రావడం వల్ల తెలంగాణతో అనుబంధం కొనసాగించే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా చేరువయ్యే ఛాన్స్ దొరికిందన్నారు.
తెలంగాణలో విమానయాన రంగానికి తన వంతు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీ, తెలంగాణలో విమానయాన రంగాన్ని పరుగులు పెట్టిస్తా్నని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా తెలంగాణ సమస్యలపై దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు. సహచర మంత్రి వర్గంతో గానీ.. తెలంగాణ ముఖ్యమంత్రితో గానీ.. ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు.
పాలనలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే 30 శాఖలు మన చేతిలో ఉండాలని.. అయితే అది సాధ్యపడదని అభిప్రాయపడ్డారు రామ్మోహన్ నాయుడు. కేంద్రంలోని అన్ని శాఖాలను సమన్వయం చేసుకుంటూ ఏపీ ప్రయోజనాలను కాపాడుతానన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టిని సారిస్తామని తెలిపారు. గతంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa