దొంగలు తెలివిమీరి పోతున్నారు. సరికొత్త పద్దతుల్లో దొంగతనాలు చేస్తున్నారు. అమాయకులను టార్గెట్ చేసి ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం దొంగలు హల్చల్ చేశారు. బైక్ మీద నుంచి కింద పడినట్లు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారిని లూటీ చేసారు. తెలివిగా వారి సెల్ఫోన్లను కొట్టేశారు. పట్టణ పరిధిలో ఇలా ఒక్క రోజే ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హెచ్పీ గ్యాస్ డీలర్ ప్రతాప్.. అవసరం నిమిత్తం కోటక్ మహీంద్ర బ్యాంకు వద్దకు వెళ్లాడు.
అయితే బ్యాంకు సమీపంలో ఓ యువకుడు బైక్ మీద నుంచి కింద పడ్డాడు. మానవత్వంతో ప్రతాప్ అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించగా... అంతలోనే అక్కడకు మరో యువకుడు వచ్చాడు. తమ వాడే అంటూ పడిపోయిన యువకుడిని లేపి ఇద్దరు కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ప్రతాప్ బ్యాంకులోకి వెళ్లిన తర్వాత జేబులో చేయి పెట్టి చూడగా.. తన ఫోన్ కనిపించలేదు. ఇదే తరహాలో పట్టణంలోని హౌసింగ్బోర్డులోనూ మోర కృష్ణ అనే వ్యక్తి ఫోన్ను దొంగలు కొట్టేశారు.
ఒకే తరహాలో నలుగురు ఫోన్లు చోరీ చేసిన దుండగులు.. ఖలీల్ దాబా సమీపంలో రోడ్డు పక్కన ఫోన్ మాట్లాడుతున్న కిషోర్ అనే వ్యక్తి ఫోన్ను లాక్కుని వెళ్లిపోయారు. ఒకే రోజు వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగల్ని పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa