ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేసులో 'ఆ నలుగురు'.. పార్టీ పగ్గాలు ఎవరికి చిక్కేనో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 07:38 PM

తెలంగాణ పీసీసీ పోస్టు ఎవరికి దక్కనుందనే దానిపై పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా.. ఈనెల 27తో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త పీసీసీ అధ్యక్షుడుని ఎన్నుకోనున్నటలు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పలువురు సీనియర్ నేతలు పీసీసీ రేసులో ఉన్నారు.


 అయితే పీసీసీ పోస్టు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా.. రాష్ట్ర పార్టీ బాధ్యతలు బీసీ వర్గానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీకి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ సైతం ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీసీ సామాజికవర్గానికి చెందిన కీలక నేతల వివరాలను ఢిల్లీకి పంపించాలని టీపీసీసీకి హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది.


పీసీసీ చీఫ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు కూడా ఒకేసారి జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే పీసీసీ చీఫ్ రేసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎంపీ సురేష్ షెట్కర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిలో నుంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన జగ్గారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ తనకే ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా పలువురు నేతలు రేసులో ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కూడా పీసీసీ కోసం ట్రై చేస్తున్నారు. సీనియర్ల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాలు సక్సెస్ చేయడం, అగ్రనేతల పర్యటనలు సజావుగా జరిగేలా నిర్వహించడం వంటి వాటిలో క్రియాశీలకంగా ఉండే నేతకు ఆ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవర్ని పీసీసీగా నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa