ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు గుడ్‌న్యూస్.. తీరనున్న సమస్యలు, ఎమ్మార్వో, ఆర్డీవోలకు బాధ్యతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 07:42 PM

భూ సమస్యలు ఉన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ధరణి దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ధరణి పోర్టల్‌లోని పెండింగ్‌ భూముల అర్జీలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. GLM, TM-38 తోపాటు స్పెషల్‌ డ్రైవ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక డ్రైవ్‌లో తీసుకున్న అఫ్లికేషన్లను పారదర్శకంగా పరిష్కరించే నిమిత్తం క్షేత్రస్థాయి పర్యటనలతోపాటు పాత ఫైల్స్‌ను పరిశీలించాలని నిర్ణయించారు.


గతంలో ధరణి సమస్యలు పరిష్కరించే అధికారం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉండేది. వేల సంఖ్యలో అఫ్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో వీటి పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా లాగిన్‌ సౌకర్యం కల్పించారు. పట్టాదారు పాసుపుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, ఎన్నారైలకు సంబంధించిన భూసమస్యలతోపాటు కోర్టు కేసుల పరిష్కారం, ప్రస్తుతం సేకరించిన భూముల్లో సమస్యలు, మిస్సింగ్‌ సర్వే నెంబర్లు, విస్తీర్ణంలో హెచ్చతగ్గులు తదితరాలను పరిష్కరించే అధికారం ఆర్డీవోలకు అప్పగించారు.


పట్టా, అసైన్డ్‌ భూముల విరాసత్‌(పౌతీ), ఖాతా మెర్జింగ్‌, జీపీఏ, స్పెషల్‌ ల్యాండ్‌ మ్యాటర్స్, వంటి బాధ్యతలను ఎమ్మార్వోలకు అప్పగిస్తూ లాగిన్‌ సౌకర్యం కల్పించారు. పెండింగ్‌ అఫ్లికేషన్లపై రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం కలెక్టరేట్లతోపాటు ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో డ్యాష్‌బోర్డులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఈ బోర్డుల్లో ఏరకమైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు వెల్లడించనున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన ధరణి అఫ్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa