హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. నగరం భౌగోళిక పరిధిని పెంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు మెుత్తంగా ఔటర్ రింగు రోడ్డు వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు.
మున్సిపల్ వ్యవహారాలు, హెచ్ఎండీఏ, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సోమవారం సీఎం రేవంత్ సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విపత్తుల నిర్వహణ విభాగానికి ఇకనుంచి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ విభాగానికి డీఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలన్నారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలని సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం నగర ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందించేలా పునర్వవస్థీకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa