హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాల్లేకుండా ప్రయాణించాలంటే మెట్రోనే బెస్ట్ ఆప్షన్. మెట్రోలో ప్రయాణంతో సమయం ఆదా కావడం మాత్రమే కాదు పర్యావరణహితం కూడా. దీంతో నగరవాసులు మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. మెట్రోతో సౌలభ్యాన్ని గమనించిన నగరవాసులు.. తమ ప్రాంతాల్లోనూ మెట్రో సేవలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ సర్కారు మెట్రో విస్తరణపై దృష్టి సారించింది.
ఇప్పటికే ప్రతి రోజూ 4-5 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యలు లేకపోతే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. చాలా మంది ప్రయాణికులు తమ ఇంటి దగ్గర్నుంచి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరకు వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారు. తమ వాహనాలను మెట్రో పార్కింగ్ ఏరియాలో నిలిపి.. ఆఫీసులకు మెట్రోలో వెళ్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సదుపాయం అందుబాటులో లేదు. పార్కింగ్ సదుపాయం ఉన్న స్టేషన్లలో చాలా వరకు ప్రయాణికులు ఉచితంగానే వాహనాలను పార్కింగ్ చేసి మెట్రోలో వెళ్తున్నారు.
అయితే తాజాగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో.. నాగోల్ మెట్రో స్టేషన్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో మెట్రో ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు దర్శనం ఇస్తోంది. ఆగస్టు 14వ తేదీ నుంచి ఇక్కడ పార్కింగ్ ఛార్జీల వసూలు మొదలైంది. ఇక్కడ బైకులను 2 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అదే 8 గంటల వరకు పార్కింగ్ చేయాలంటే రూ.25 చెల్లించాలి. 12 గంటల వరకు బైకులను పార్క్ చేయాలంటే రూ.40 కట్టాలి. అంటే హైటెక్ సిటీ ఏరియాలో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి నాగోల్ స్టేషన్లో బైక్ పార్కింగ్ చేయడానికి రోజుకు రూ.40 చెల్లించుకోవాలన్నమాట.
అదే కారుకైతే కనీసం రెండు గంటలు పార్కింగ్ చేయడానికి రూ.30, 8 గంటల వరకు అయితే రూ.75, 12 గంటల వరకైతే 120 చెల్లించాలి. అదనంగా ఒక్కో గంటకు రూ.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో టికెట్ కంటే కారు పార్కింగ్ ఛార్జీ ఎక్కువగా ఉందని ఓ నెటిజన్ పోస్టు చేశారు. ఈ మోత ఏంటి బాబోయ్ అనుకుంటున్నారా..? అయితే 40 శాతం డిస్కౌంట్తో పార్కింగ్ చేసుకునేలా మంత్లీ పాసులు కూడా ఇస్తున్నారట. ఇంత చేసినా పార్కింగ్ చేసిన వాహనాలు దొంగతనాలకు గురైనా, దెబ్బతిన్నా, ఏవైనా వస్తువులు పోయినా మా బాధ్యత లేదంటూ మెట్రో వర్గాలు నోటీస్ పెట్టడం గమనార్హం.
నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఆరంభం నుంచి ఇప్పటి వరకూ ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసిన ప్రయాణికులు.. ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ అనడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాప్ ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించాలని చెప్పడం.. ఆ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు. ‘పార్కింగ్ ఏరియా మొత్తం గుంతలున్నాయి. మరోవైపు పార్కింగ్ ఛార్జీల వసూలు మొదలుకానుంది. ఎలాంటి మెరుగుదల లేకుండా ఈ బాదుడు సరికాదు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించండి’ అని సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఎల్ అండ్ టీ మెట్రోకు ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa