బియ్యం ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులకే పరిమితమైందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త వంగడాలను మంత్రి విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్ గొప్ప విజయం సాధించిందని, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రముఖ దేశంగా మారిందని అన్నారు. ఈ కొత్త వంగడాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలోని గత 11 ఏళ్లలో 3,236 అధిక దిగుబడినిచ్చే వంగడాలకు ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. వాతావరణ మార్పులు, కరవు, నేలల లవణీయత వంటి సవాళ్లను తట్టుకునేలా ఈ కొత్త వంగడాలను రూపొందించినట్లు వివరించారు.ఒకప్పుడు ఆహార కొరత ఎదుర్కొన్న భారత్, ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి చేరిందని చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa