ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకొచ్చిన ఎయిమ్స్‌, బ్యాంకులు తీసకపోతివి.... చంద్రబాబుపై కేతిరెడ్డి ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 08:07 PM

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది. చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని చంద్రబాబుపైనా, టీడీపీపైనా వైసీపీ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే కాదని., రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు, బ్యాంకులను కూడా అమరావతికి తరలించుకుపోయారని ఆరోపించారు.


"రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఉన్న సత్సబంధాలతో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకున్నాడు. ఆయన గురువైన చంద్రబాబు మాత్రం శిష్యుడితో ఉన్న సత్సబంధాలను ఉపయోగించుకని మనకు మేలు చేయలేకపోయాడు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు మాట్లాడలేదు. ఇంతగా అసమానతలు పెంచుతున్నా ఎవరూ మాట్లాడటం లేదు. అప్పట్లో అయితే మైసూరారెడ్డి మామ, రమణారెడ్డి వంటి వాళ్లు పాదయాత్రలు చేశారు. ఇప్పుడు అలాంటి సీనేమీ లేదు. పొద్దున లేచినప్పటి ఏది ఇంపార్టెంట్ అంటే.. అనసూయ, అన్వేష్, శివాజీ..ఇవి తప్ప వేరేటివి కనపడుతున్నాయా.." అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శలు గుప్పించారు.


"రాయలసీమకు సంబంధించి అనంతపురానికి ఎయిమ్స్ వచ్చింది. గుంటూరుకు తీసుకుపోయారు. ఏం గుంటూరులో కార్పొరేట్ ఆస్పత్రులు లేవా. కర్నూలుకు హైకోర్టు వచ్చింది. దాన్ని తీసుకుపోయారు. కడప నుంచి రీజనల్ బ్యాంకులు తీసుకుపోయారు. చివరకు తాగేనీటికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. హంద్రీ నీవా కాలువలో లైనింగ్ వేయటంతో.. బోర్లు ఎండిపోతున్నాయి.


"కుప్పానికి నీళ్లు తీసుకుపోవాలని కాలువలో లైనింగ్ వేశారు. తెలుగుదేశం పార్టీకీ ఇవేమీ అవసరం లేదు.. వారికి కావాల్సింది ఒకటే.. ఆవకాయ్ అమరావతి. ఇది తప్ప వేరేటి పట్టడం లేదు. సాయంత్రానికి నూరు రూపాయలకు మద్యం దొరికితే చాలు. ఇలాంటి వాటితోనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది" అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రాయలసీమలోని కూటమి నేతలు ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడాలని.. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాలని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమలోని టీడీపీ నేతల మౌనం.. ఈ ప్రాంతానికి శాపంగా మారుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa