ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాద్‌నగర్ మహిళ థర్డ్ డిగ్రీ ఘటన.. డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 08:50 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఘటనకు బాధ్యులైన ఇన్‌స్పెక్టర్‌ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతకముందు ఈ ఘటనలో డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.


  సైబరాబాద్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సునీత. భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24న షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, మరో నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు రఫీ, మోహన్ లాల్, కరుణాకర్ ,అఖిల సునీత, భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు.


బస్సులో కండక్టర్ బూతులు మాట్లాడుతుండు: విద్యార్థుల ఆవేదన


ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు.. 13 ఏళ్ల కుమారుడి ముందే సునీతను చిత్రహింసలకు గురి చేసారు. చీరవిప్పి నిక్కర్ తొడిగి రబ్బర్ బెల్టుతో, బూటుకాళ్లతో విచక్షాణారహితంగా కొట్టారు. దొంగతనం ఒప్పుకోకపోవడంతో తన కుమారుడిని కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్‌ తో కొట్టినట్లు బాధితులు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పి పడిపోగా.. సునీతను ఇంటికి పంపించారు. కాగా, ఈ ఘటన బయటకు పొక్కటంతో తీవ్ర దుమారం రేగింది. దళిత మహిళపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ కూడా దాఖలైంది.


సునీతపై దాడికి పాల్పడ్డ డీఐ రామిరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించాలని, అరెస్టు చేసి శిక్షించాలని న్యాయవాది, సమతా సైనిక్‌ దళ్‌ న్యాయ సలహాదారు డాక్టర్‌ బీ కార్తీక్‌ నవయన్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో గురువారం ఫిర్యాదు చేశారు. కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితురాలికి పరిహారంతో ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డీఐ రామిరెడ్డితో సహా.. నలుగురు కానిస్టేబుళ్లపై తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa