ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డకెక్కనున్న ఈ సూపర్ లగ్జరీ బస్సులు,,,,ఇక నో టెన్షన్, బస్సుల్లో సీట్లు దొరుకుతాయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 09:37 PM

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింది మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పి్స్తున్న సంగతి తెలిసిందే. జీరో టికెట్ తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండటం లేదు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్‌ సూపర్‌లగ్జరీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు.


 తొలిదశలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్‌-హైదరాబాద్, నిజామాబాద్‌-హైదరాబాద్‌ రూట్లలో తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ బస్సులకు ఈ-సూపర్‌ లగ్జరీ బస్సులకు పేరు పెట్టారు. నిజామాబాద్‌-2 డిపోకు 13, కరీంనగర్‌-2 డిపోకు 35 బస్సులు ఇప్పటికే చేరుకున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ఆర్టీసీ యాజమాన్యం అద్దె పద్ధతిలో తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో నగరంలో సిటీ బస్సులుగా, హైదరాబాద్‌-విజయవాడ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులుగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తోంది. వీటిల్లో ఏసీ, నాన్‌ ఏసీ మెట్రో డీలక్స్‌ బస్సులున్నాయి.


అయితే సూపర్‌ లగ్జరీలో ఎలక్ట్రిక్‌ బస్సులు రానుండటం మాత్రం ఇదే తొలిసారి కానుంది. త్వరలోనే ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభిస్తారని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. మామూలుగా అయితే కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త బస్సులను తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైన మేరకు కొత్త బస్సులను కొనుగోలు చేయలేకపోతోంది. అందుకు ప్రత్యామ్నాయంగా డీజిల్‌ బస్సుల నుంచి ఎలక్ట్రిక్‌ బస్సులకు సంస్థ ప్రాధాన్యమిస్తోంది.


కొత్త బస్సుల కొనుగోలు ఖర్చు భారం ఆర్టీసీపై పడకుండా అద్దె పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. వీటిల్లో డ్రైవర్లుగా బస్సు తయారీ సంస్థ సిబ్బందే ఉండనున్నారు. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ నుంచి ఉంటారు. ఈ బస్సులకు కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ బస్సులు రోడ్డెక్కితే బస్సుల్లో రద్దీ తగ్గటమే కాదు.. సీట్లు కూడా దొరుకుతాయ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa