దేశవ్యాప్తంగా ఆడపడుచులు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నదమ్ములు ఎంత దూరాన ఉన్నా సరే.. వారిపై ఉన్న ప్రేమతో వెళ్లి రాఖీ కట్టి తమ అనుబంధాల అనురాగాలు చాటుకుంటున్నారు సోదరీమణులు. ఈ క్రమంలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టి.. వారి మధ్య ఉన్న సోదరభావాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీతక్క.. ఆయనతో పాటు ఆయన మనవడికి కూడా రాఖీ కట్టి నోరు తీపి చేశారు. సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ ఛైర్మన్లు శోభారాణి, శారద, సుజాత కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. వీరితో పాటు.. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రాఖీ కట్టారు.
అయితే.. గతంలోనూ.. రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కట్టగా.. ఈసారి కూడా అదే రాఖీ కట్టి తమ అనురాగాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సీతక్కకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు.
"సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు.. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని.. మనసారా కోరుకుంటున్నాను." అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. అంతకు ముందు తెలంగాణలోని ఆడపడుచులందరికీ రేవంత్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. రేవంత్ రెడ్డికి సీతక్కకు మధ్య చాలా రోజులుగా మంచి అనుబంధం ఉన్న విషయం తెలసిందే. టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఇద్దరు అన్నాచెల్లెల్లుగా ఉంటూ అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో.. కాంగ్రెస్లోకి కూడా ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో కాంగ్రెస్లో చేరగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో సీతక్కకు మంత్రి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు.
మరోవైపు... సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క మాట్లాడుతూ.. మహిళలందరిలో అక్కాచెల్లెళ్లను చూసుకోవాలని తెలిపారు. అందరికీ రక్షా బందన్ శుభాకాంక్షలు తెలిపారు. మన ఇంట్లో ఆడబిడ్డల్లాగే.. బయట మహిళలను కూడా చూడాలంటూ పురుష సమాజానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. అప్పుడే సమాజంలో శాంతి ఉంటుందని తెలిపారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సీతక్క రాఖి కట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందేనని తెలిపారు. మహిళల రక్షణ విషయంలోనూ తాము ప్రియారిటీ ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa