వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపును భారీ స్పందన లభిస్తోంది. దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, సినీ ప్రముఖులు, వైద్యులు, ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు సహా పలు రంగాల వారి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎంఎఫ్ఆర్) విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్కు స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్.. డిప్యూటీ సీఎం భట్టి, పలువురు బ్యాంకు ఉద్యోగులతో కలిసి అందించారు.
అలాగే, అరబిందో ఫార్మా సైతం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించింది. సంబంధిత చెక్కును కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ మదన్మోహన్రెడ్డి.. సీఎం రేవంత్కు అందించారు. వీరితో పాటు ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తమ ఆస్పత్రి తరఫున రూ.కోటి విరాళం అందించారు. రాష్ట్ర విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఒక రోజు మూలవేతనాన్ని సీఎంసహాయనిధికి అందించాలని నిర్ణయించారు. మేరకు గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులు కలిసి సమ్మతి పత్రాన్ని అందించారు. ఒక రోజు మూల వేతనం దాదాపు రూ.15కోట్లు ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారు.
హెటిరో ఫార్మ, సింధు ఆస్పత్రుల అధినేత, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి... వరద బాధితుల సహాయార్ధం గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు రూ.కోటి చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు కూడా రూ.కోటి విరాళం ఇస్తానని ఆయన ప్రకటించారు. వరద బాధితులకు వైద్యసేవల కోసం సింధు ఆస్పత్రుల తరఫున వైద్య బృందాలు, ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగా అంబులెన్స్లను ఎంపీ పార్థసారథిరెడ్డి, కలెక్టర్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు. కాగా, రెండు, మూడ్రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.150కోట్లకుపైగా విరాళాల ప్రకటనలు వచ్చినట్టు అధికారుల ప్రాథమిక అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa