ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన 'థాంబా పట్టి మెహర్ దేశ్ ఖాప్' పంచాయతీ సామాజిక విలువల పరిరక్షణ పేరుతో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. యువత దారి తప్పుతోందని, క్రమశిక్షణ లోపిస్తోందని భావించిన ఖాప్ నేతలు.. విద్యార్థులు, యువత జీవనశైలిపై కఠిన ఆంక్షలు విధించారు.18 ఏళ్ల లోపు పిల్లలు స్మార్ట్ఫోన్లు వాడటం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గడమే కాకుండా పెద్దల పట్ల అవిధేయత పెరుగుతోందని ఖాప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే టీనేజర్లకు మొబైల్ ఫోన్లను నిషేధించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో అబ్బాయిలు హాఫ్ ప్యాంట్లు, అమ్మాయిలు షార్ట్స్ ధరించకూడదని ఆదేశించారు. అబ్బాయిలు కుర్తా-పైజమా, అమ్మాయిలు సల్వార్-కమీజ్ వంటి సంప్రదాయ దుస్తులే ధరించాలని సూచించారు. ఇంట్లో ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చని, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం 'సామాజిక నిబంధనలు' పాటించాలని హుకుం జారీ చేశారు.కేవలం యువతపైనే కాకుండా వివాహ వేడుకల విషయంలోనూ ఖాప్ పంచాయతీ కీలక మార్పులు సూచించింది. వివాహాలు మ్యారేజ్ హాళ్లలో కాకుండా గ్రామాల్లో లేదా సొంత నివాసాల్లోనే జరుపుకోవాలని పేర్కొంది. మ్యారేజ్ హాల్ కల్చర్ వల్ల కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. పెళ్లి పత్రికల ముద్రణ ఖర్చును తగ్గించేందుకు వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు పంపడం ఉత్తమమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa