ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 07:34 PM

కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తాజాగా కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణన్‌ను కలిసిన బండి సంజయ్.. ఈ మేరకు లేఖను అందజేశారు. కరీంనగర్ నుంచి ఉమ్మడి వరగంల్ జిల్లా హసన్‌పర్తి వరకు 61.8 కి.మీల మేర కొత్త రైల్వే లైన్ ప్రతిపాదించారు. రూ.1415 కోట్లు వ్యయంతో ఈ మేరకు ప్రతిపాదనలు రెడీ చేశారు.


ఈ మేరకు డీపీఆర్ కూడా రెడీ చేశారు. అయితే ఈ డీపీఆర్ రైల్వే బోర్డులో పెండింగ్‌లో ఉందని బండి సంజయ్ కుమార్ తెలిపారు. తక్షణమే డీపీఆర్ ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కరీంనగర్ – వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు.


అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను కూడా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఉప్పల్ స్టేషన్ అప్‌గ్రేడ్‌లో భాగంగా.. ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరారు. పార్కింగ్‌ను విస్తరించటంతో పాటుగా.. సోలార్ ప్యానెళ్లను అమర్చాలన్నారు. టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలన్నారు. అలాగే జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.


ఇక రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త రైల్వేస్టేషన్లు, అభివృద్ధి చేస్తున్న మరికొన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే అవి పూర్తవుతాయని చెప్పారు. వాటి మధ్య ఉన్న రోడ్ల విస్తరణ విషయంలో చొరవ చూపి.. అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa