వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తుల కష్టాలకు మోక్షం లభించనుంది. ఏళ్లనాటి కల తొందర్లోనే నెరవేరనుంది. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అటు ఆలయంలోనూ.. ఇటు ఆలయం బయట పరిసరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆలయం లోపల సరైన నిర్వాహణ లేకపోవటమో.. లేక సరైన ఏర్పాటు చేయకపోవటమో కానీ.. మొత్తానికి రాజన్న దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం క్యూలైన్లలో తిప్పలు తప్పటం లేదన్నది.. అందరికీ తెలిసిన కఠోర వాస్తవం. మరోవైపు.. దర్శనం చేసుకుని బయట సరదాగా షాపింగ్ చేద్దామనో.. లేదా పోచమ్మ గుడికో, భీముని ఆలయానికో.. లేదా గదులకో, బస్టాండుకో వెళ్ధామంటే కూడా ఆ ఇరుకైన రోడ్డులో, రద్దీలో నడవాలంటేనే నరకం కనిపిస్తుంది. ఇక వాహనదారులకైతే చుక్కలు కనిపించాల్సిందే.
ఎప్పుడెప్పుడు ఆ రోడ్ల విస్తరణ చేస్తారా.. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని భక్తులతో పాటు స్థానికులు కూడా ఏళ్లుగా ఎదురుచూస్తుండగా.. ఇన్నాళ్లకు శుభవార్త వినిపించింది. ఇక ట్రాఫిక్ కష్టాలు దూరం కావటంతో పాటు మెరుగైన వసతులు కూడా అందుబాటులోకి రానున్నాయి. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి గుడి వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 80 ఫీట్ల వెడల్పు చేసే పనులకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే.. భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. శనివారం (సెప్టెంబర్ 07న) రోజున రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం నుంచి భూ సేకరణ నిమిత్తం ప్రకటన విడుదలైంది. దీంతో.. రోడ్డు విస్తరణ పనులకు మొదటి అడుగు పడింది.
అయితే.. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ ఇప్పటికే 50 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనులకు కూడా ముందడుగు పడటంతో.. స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు.. వేములవాడ ఆలయంలో తిరుపతి తరహాలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శనాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో కోడెల సంరక్షణకు మూడు షెడ్లు నిర్మించారు. దాంతో పాటు గోశాలలో సీసీ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణానికి కూడా పనులు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే.. తిరుమల తరహాలోనే వేములవాడలో కూడా భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కాగా.. నిత్యాన్నదాన సత్రం కోసం.. ఆలయం సమీపంలోని శివార్చన స్టేజి దగ్గర సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa