ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలోనే తొలి గ్రామంగా.. రికార్డుకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సొంతూరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 09:20 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి.. రికార్డుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే తొలి గ్రామంగా వెలిగిపోయేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు.. అధికారులు సర్వే కూడా ప్రారంభించారు. ఇంతకూ ఏ రికార్డు అనేగా మీ డౌటనుమానం. అదేనండి.. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. కొండారెడ్డిప‌ల్లిని రాష్ట్రంలో మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా మార్చే ప్రక్రియను సంబంధిత అధికారులు ప్రారంభించారు.


ఇందులో భాగంగానే.. టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ ఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీతో పాటు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌లెక్టర్ సంతోష్‌, రెడ్కో వీసీ, ఎండీ అనిల‌, సంస్థ డైరెక్టర్ కే రాములు, ఇత‌ర శాఖ‌ల ముఖ్య అధికారులంతా.. మంగ‌ళ‌వారం (సెప్టెంబర్ 10న) రోజున కొండారెడ్డిప‌ల్లిలో ప‌ర్యటించారు. గ్రామ‌స్తులు, రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల‌తో అధికారులు మాట్లాడి.. ఈ పైల‌ట్ ప్రాజెక్టు వివ‌రాలు వివరించారు.


అయితే.. కొండారెడ్డిప‌ల్లిలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 కమర్షియల్ కస్టమర్లతో పాటు 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేట‌గిరిల‌తో కలుపుకుని మొత్తంగా 1451 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే.. ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేసే ప్రక్రియలో భాగంగానే.. గ్రామంలో మంగ‌ళ‌వారం నుంచి ఇంటింటి స‌ర్వే కూడా చేయ‌డం మొదలుపెట్టారు.


ఈ స‌ర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి.. డీపీఆర్ త‌యారు చేయటంతో పాటుగా.. ఇత‌ర ప్రక్రియ‌ల‌ను కూడా అధికారులు మొదలుపెట్టున్నారు. దీంతో.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి సౌర విద్యుత్ కాంతులతో వెలుగిపోనుంది. ఫలితంగా.. రాష్ట్రంలోనే పూర్తిస్థాయి తొలి సోలరైజ్డ్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి రికార్డు క్రియేట్ చేయనుంది.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడి స్వగ్రామంగా కొండారెడ్డిపల్లికి చాలా పాపులారిటీ వచ్చింది. సొంత గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం గతంలో నుంచే పలు సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రకరకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa