ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రా కూల్చివేతలను అడ్డగించిన వారిపై క్రిమినల్ కేసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 09:41 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వాటిని నేలమట్టం చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో వందలాది నిర్మాణాలను కూల్చేశారు. ఈనెల 8న హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఉదయాన్నే పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో పలువురి ఇండ్లు, గోదాంలు, షెడ్లను కూల్చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలను కొందరు స్థానికులు అడ్డుకున్నారు.


తమను అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తమ ఇండ్లు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుంటామని బెదిరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. తాము పిల్లాపాపలతో ఉన్నామని.. ఇండ్లను కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ..వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అతికష్టం మీద వారిని అక్కడి నుంచి తరలించారు.


తాజాగా.. హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నవారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేసిన వెంకటేష్ (35), అతని భార్య లక్ష్మి (28), వెంకటేష్ సోదరుడు నరేష్ (28)పై కేసులు పెట్టారు. హైడ్రా అధికారుల విధులను అడ్డుకున్నారని పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. పెట్రోల్ పోసుకొని బెదిరించటంతో పాటు అధికారులను దుర్భాషలాడినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.


ఇక సున్నం చెరువులో ఆక్రమణ కూల్చివేతలపై చిన్న చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి నుంచి వాటిని తాము అద్దెకు తీసుకున్నామని.. అవి అక్రమ నిర్మాణాలు అనే విషయం తమకు తెలియదని వాపోయారు. హైడ్రా అధికారులు తమకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఉదయం 5 గంటల సమయంలో వచ్చి సామాన్లను తీసి బయట పడేశారని కంటతడి పెట్టుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంతో తాము రోడ్డున పడ్డామని కన్నీంటి పర్యంతమయ్యారు.


సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా.. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించగా.. 15 ఎకరాల 23 గుంటల్లో చెరువు, నీళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ చెరువును అక్రమార్కులు కబ్జా చేసి షెడ్స్, భవనాలు నిర్మించుకున్నారు. దీంతో చెరువు విస్తీర్ణం 5 ఎకరాలకు తగ్గిపోయింది. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa