గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాలపై సమావేశంలో చర్చించారు.
ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని.. అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభ్యులుగా నియమించి.. ఇందుకోసం జీవో విడుదల చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రజా భవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈనెల 20 నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాల, కళాశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి (7 డిసెంబర్ 2023) నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని NRI సెల్ సూచించింది. దీనిని తెలంగాణ ఏర్పడినప్పటి రోజు జూన్ 2 ,2014 లేదా ఏరోజు తీసుకుంటే బాగుంటుందనే దానిపై కమిటీలు పలువురు సూచనలు చేశారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మేల్యేలు ఇతర ముఖ్య నేతలు పలు సలహాలు సూచనలు చేశారు. ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కార్మికులు.. గల్ఫ్లో మృతి చెందగా వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నుంచి పరిహారం అందిచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరిగానే గల్ఫ్ భీమా ఉండాలని సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని.. అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే మృతదేహం రావడానికి వారం రోజులకు పైగా సమయం పడుతుందని.. 48 గంటల్లో ఇక్కడికి వచ్చేలా చూడాలని తెలిపారు. దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ.. కేరళ రాష్ట్రంలో ఉందని అక్కడ ఉన్న దానిని స్టడీ చేయాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కేరళలో జీడీపీకి ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తుందని.. తెలంగాణలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa