ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు.. త్వరలోనే స్పెషల్ ఆర్డినెన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 07:03 PM

హైదరాబాద్‌లో అక్రమార్కులను హడలెతతిస్తోన్న హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైన సందర్భంగా.. ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలోనే.. జీవో 99ను ఛాలెంజ్ చేసిన పిటిషనర్ పలు అభ్యంతరాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పూర్తిగా చట్టబద్దమైనదేనని రంగనాథ్ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే.. హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ.. అక్టోబర్‌లోపు ఆర్డినెన్స్‌ వస్తుందని రంగనాథ్ తెలిపారు.


మరోవైపు.. త్వరలోనే హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు రానున్నట్టు రంగనాథ్ తెలిపారు. హైడ్రా చట్టబద్దమైనదేనని.. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ అక్టోబర్‌లోపు వచ్చే అవకాశముందని తెలిపారు. ఆరు వారాల తర్వాత.. అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం సేవలందిస్తున్న గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలోనే హైడ్రా కూడా పనిచేస్తుందని వివరించారు. మున్సిపాలిటీలు, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు తమవంతు సహకారం అందిస్తామని రంగనాథ్ చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే.. హైడ్రాకు మరో కీలక బాధ్యత కూడా అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో హైడ్రా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే.. నిర్మాణాలు చేపట్టేలా.. ఆ సంస్థకు అధికారాలు కట్టబెట్టనున్నట్టు సమాచారం. అయింతే.. అందుకు సంబంధించిన విధివిధానాలను తర్వలోనే విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో.. నగరవ్యాప్తంగా ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్న.. మిగతా శాఖలతో పాటు హైడ్రా పర్మిషన్ కూడా ఉండాల్సిందే అన్నమాట. కాదు కాదు.. అన్ని పర్మిషన్ల కంటే ముందు.. హైడ్రా  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే మిగతా శాఖలు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట.


మరోవైపు.. హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం.. దాని పరిధిలో ఉన్న విచక్షణాదికారాలను ఇతర ఆథారిటీలకు ఇవ్వకూడదని ప్రస్తావించిన పిటిషనర్.. హైడ్రాకు ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. జీవో 99 ప్రకారం హైడ్రా కమిషనర్‌గా ఆల్ ఇండియా సర్వీసుకు సంబంధించిన అధికారిని లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలని.. కానీ ప్రస్తుతం ఉన్న కమిషనర్‌కు అలాంటి అర్హతలు లేవని ధర్మాసనానికి తెలిపారు. దీంతో... పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారును ఆదేశించింది. కాగా.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa