ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా వేలాది మంది కార్మికులు, వాహనాలు, యంత్రాలు, భారీ నిర్మాణ సామగ్రి కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అమరావతి శాశ్వత సచివాలయం, ట్రంక్ రోడ్లు పనులు వేగవంతం చేశారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికి ఎల్పీఎస్ లేఅవుట్ నిర్మాణ పనులు కూడా వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రోడ్లు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. ఏపీ ఎన్ఆర్టీ, హ్యాపీనెస్ట్ పనులు ఊపందుకున్నాయి. హ్యపీనెస్ట్కు సంబంధించి పైల్ ఫౌండేషన్ పనుల్ని పూర్తిచేసి బేస్మెంట్ కోసం ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టారు.
మరోవైపు మంత్రి నారాయణ రాజధానిలో పర్యటించారు. వడ్డమానులో మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి ప్రధాన రహదారిని ప్రారంభించారు. రైతుల రిక్వెస్ట్తో కేవలం వారం రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అమరావతి ప్రపంచంలో టాప్5 లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామన్నారు. 98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించామని తెలిపారు.
రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌలిక వసతుల పనులు చేపడతామన్నారు మంత్రి నారాయణ. ఈ అభివృద్ధి పనులు రూ.900 కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధమైందన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి.. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. అమరావతిలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఇన్నర్ రింగ్ రోడ్,స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటామన్నారు. ల్యాండ్ పూలింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని.. ల్యాండ్ పూలింగ్కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూసేకరణ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతిని గుంటూరు, విజయవాడకు కనెక్ట్ చేసే రోడ్లకు సంబంధించిన పనులు కూడా వేగవంతం అయ్యాయన్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కరకట్టుకు సమాంతరంగా ఉన్న సీఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు నెక్ట్ చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఈ నెల 25న అమరావతిలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa