ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనాలు చేసి తీరుతాం.. పోలీసులకు గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 07:58 PM

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనాల అంశంపై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనాలపై నిషేధ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లెక్సీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిషేదం విధించినట్లు బోర్డులు పెట్టారు. ఈ ఆంక్షలపై భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం ట్యాంక్ బండ్‌పై చేరుకున్న కమిటీ సభ్యులు.. అక్కడ ఏర్పాటు చేసిన బారిగేడ్లను తొలగించారు.


  పోలీసుల ఆదేశాలను ధిక్కరించి హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జనాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోందని వారు మండిపడ్డారు. చాలా సంవత్సరాలుగా హూస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు జరుగుతున్నాయని.. ఇప్పుడెందుకు కొత్త రూల్స్ పెట్టారని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. 2022లో, 2023లో కూడా ఇదే విధంగా ఆంక్షలు విధించారని.. కానీ చివరకు హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే.. రేపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆందోళనకు దిగాతామని పోలీసులను హెచ్చరించారు.


ఇదిలా ఉండగా.. హైదరాబాద్ గ్రేటర్ వాప్యంగా సెప్టెంబర్ 17న నిమజ్జనాలు జరగనున్నాయి. ఖైరతాబాద్ మహా గణపతిని కూడా ఆరోజే నిమజ్జనం చేస్తారు. అందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమజ్జనం కోసం 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని నగరానికి తెస్తున్నామన్నారు. నిమజ్జనాలపై మంత్రి పొన్నం కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa