సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగిరి గంతేసే వార్త వినిపించింది. సింగరేణి కార్మికులకు భారీ ఎత్తున బోనస్ ప్రకటించింది. 2023- 24 ఏడాదికి గానూ.. సింగరేణికి 4 వేల 701 కోట్లు లాభం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇందులో భాగంగా.. కార్మికులకు 796 కోట్ల రూపాయలు బోనస్గా ప్రకటిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో.. సగటున ఒక్కొ కార్మికునికి లక్షా 90 వేల రూపాయలు బోనస్ రానున్నట్టు స్పష్టం చేశారు. కేవలం సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులకే కాకుండా.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం (సెప్టెంబర్ 20న) రోజున సచివాలయంలో సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి.. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే.. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించారు. అయితే.. గతేడాది ప్రకటించిన బోనస్ కంటే.. ఈసారి 20 వేలు అధికంగా ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా కార్మికులకు లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలోనే.. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాను కార్మికులకు ఇచ్చి వారి కళ్లల్లో ఆనందం చూడాలని నిర్ణయించినట్టు తెలిపారు. దసరా ముందే లాభాల్లో వాటాను కార్మికులకు అందిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు.. సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి తలమానికమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సింగరేణిని విస్తరించాలన్న ఆలోచనతో.. కొంత పెట్టుబడి కూడా పెట్టాలని నిర్ణయించినట్టు తీసుకున్నామని తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని తెలిపిన భట్టి విక్రమార్క.. తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇస్తున్నామని వివరించారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటుగా.. కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు బోనస్ అందిస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa