ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 08:02 PM

ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించేందుకు టీజీఎస్ ఆర్టీసీ అన్ని రకాలుగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా.. అంతకు ముందు నుంచే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ రకరకాల ఆఫర్లు ప్రకటించటంతో పాటు, అవసరమైన మార్గాల్లో ఎక్కువ సేవలు అందించటం లాంటి సౌకర్యాలు కల్పిస్తూ.. ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షిస్తుండేది. కాగా.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుండగా.. అది కేవలం ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితమవుతుండగా.. మిగతా బస్సుల్లో మహిళలు, అన్ని బస్సుల్లో పురుషులకు కూడా వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తూ వస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ తీపికబురు వినిపించింది.


ఇక నుంచి.. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే పుష్పక్ బస్సు టికెట్ ధరల్లో భారీ డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఆ ప్రయాణికుల కోసం.. ఇక నుంచి పుష్పక్ బస్సుల్లోని టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. అయితే.. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి.. ఎయిర్ పోర్ట్‌కు పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేస్తే అలాంటి గ్రూప్‌‍కి అదనంగా మరో 10 శాతం కలిపి మొత్తం 20 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.


అయితే.. ఈ బంపర్ ఆఫర్ కేవలం సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకొని పుష్పక్ బస్సుల్లో క్షేమంగా ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాలని సంస్థ యాజమాన్యం కోరుతోంది. ఈ డిస్కౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్‌ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. అంటే.. డైరెక్టుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐలతో పేమెంట్ చేసి.. టికెట్ పొందే సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సౌకర్యం.. కేవలం ఎయిర్ పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సుల్లోనే కాదు.. మిగతా మార్గాల్లో సేవలందిస్తోన్న పుష్పక్ బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు, నాన్ స్టాప్ బస్సుల్లో కూడా తీసుకొచ్చింది. అయితే.. ఈ విధానంలో చిల్లర సమస్యకు చెక్ పెట్టిన టీజీఎస్ ఆర్టీసీ.. ఇదే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న పల్లె వెలుగు బస్సుల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది టీజీఎస్ ఆర్టీసీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa