గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని డీజేలు హోరెత్తించారు. డీజేలు, డ్యాన్సులతో పాటు టపాసుల మోత, యువతీ యువకుల కేరింతలతో జంట నగరాలు దద్దరిల్లిపోయాయి. అన్ని నగరాలు, చిన్న చిన్న పట్టణాల్లోనూ డీజేల సంప్రదాయం నానాటికీ పెరిగిపోతోంది. తమ ప్రాబల్యాన్ని చూపించుకునేందుకు ఒకరికి మించి ఒకరు పోటీగా డీజేలను, భారీ హంగులను పండగల వేళ ర్యాలీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. స్పాన్సర్లు కూడా దొరుకుతుండటంతో ఖర్చు కోట్ల రూపాయలు అవుతోంది. ఇదంతా ఇలా ఉంటే.. డీజేల కారణంగా శబ్ద కాలుష్యం ఎక్కువవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. తెల్లవార్ల వరకూ డీజేలతో హోరెత్తిస్తుండటంతో మనశ్శాంతి లేకుండా పోతుందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ధ్వని కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయనే ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ర్యాలీలలో డీజేలను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మతపరమైన పండగలు, ర్యాలీల్లో డీజేలను బ్యాన్ చేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. డీజేలను ఉపయోగించడం వల్ల లాభం లేదని, ధ్వని కాలుష్యం ఎక్కువవుతోందని అభిప్రాయపడ్డారు. డీజేలకు అయ్యే ఖర్చును పేదల విద్య, వివాహం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించవచ్చని సూచించారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగానూ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లోనూ భారీ డీజేలను ఉపయోగించారు. పాతబస్తీలో డీజేలు హోరెత్తించాయి. చార్మినార్ వద్ద ఓ భారీ డీజే.. అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన డీజేల వాడకంపై చర్చకు తెరలేపింది. మిలాద్ ర్యాలీల్లో డీజేలను ఉపయోగించిన యువకులపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని శుక్రవారం (సెప్టెంబర్ 20) అర్ధరాత్రి దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. మదర్సాలు మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్నాయంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ ఖండించారు. ‘మదర్సాలంటే ఏమిటో ఆయనకు తెలుసా..? దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదు, ఎంతో మంది ముస్లింల ప్రాణత్యాగ ఫలితంతోనే స్వాతంత్య్రం సిద్ధించింది’ అని అసదుద్దీన్ అన్నారు.
మణిపూర్లో పోలీసుల చేతిలో నుంచి ఏకే-47 రైఫిల్స్ను లాక్కొని వెళ్లినవారిని పట్టుకునేందుకు బండి సంజయ్ అక్కడకు వెళ్లాలని అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకు ప్రత్యేక చట్టం తెస్తున్నారని, దాన్ని దేశంలోని లౌకిక వాదులందరూ వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు. జమ్మూ కశ్మీర్, హర్యాణాలో బీజేపీ ఘోర ఓటమిని చవిచూడబోతోందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని ముంబై, పూణేలో శబ్ద కాలుష్యానికి కారణమైన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ అంశంపై అక్కడ రాజకీయ దుమారం రేగడంతో.. కొంత మంది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సమయంలో డీజేలు శబ్ద కాలుష్యాన్ని కలిగించలేదా అని కొంత మంది నేతలు ప్రశ్నించారు. దీనిపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘గణేష్ చతుర్థికి డీజేలు హానికరమైతే, మిలాద్ ఉన్ నబీకి కూడా డీజే హానికరమే’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa