ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుదైన జబ్బులతో బాధపడే పిల్లలకు వరం.. రూ.50 లక్షల ఖరీదైన వైద్యం నిమ్స్‌లో ఉచితం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 09:40 PM

అరుదైన జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వరం లాంటి వార్త. అలాంటి చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్‌లో 50 లక్షల ఖరీదైన ఉచిత వైద్యం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పాలసీ ఫర్‌ రేర్‌ డిసీజ్‌ పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో అమలు చేస్తున్నారు. జెనెటిక్‌, అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు నిమ్స్ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులు, డాక్టర్లను ఏర్పాటు చేశారు.


చిన్నారులు గౌచర్‌, పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే కోలుకోవటం కష్టం. వారికి జీవితాంతం ఖరీదైన మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరహా బాధిత చిన్నారుల్లో ఎదుగుదల అనేది సరిగా ఉండదు. మానసిక పరిపక్వత కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ అందించకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిలొచ్చు. వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈక్రమంలో జెనెటిక్‌, అరుదైన జబ్బులకు చికిత్స అందిచేందుకు కేంద్రం ఎన్‌పీఆర్‌డీ పాలసీని తీసుకొచ్చింది.


సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయాగ్నోస్టిక్‌ సహకారంతో నిమ్స్‌ హాస్పిటల్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జెనెటిక్‌ విభాగంలో ఈ డే-కేర్‌ సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సెంటర్‌లో గౌచర్‌, పాంపే వంటి అరుదైన వ్యాధులకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. ఈ పాలసీ ప్రకారం ఒక్కో చిన్నారి చికిత్సకు రూ.50 లక్షలను సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ మినిస్ట్రీ నుంచి నిధులు కేటాయిస్తారని చెప్పారు. దాంతో బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గౌచర్‌ వ్యాధితో బాధపడుతున్న 26 మంది పిల్లలకు నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ జరుగుతోందని డాక్టర్లు తెలిపారు.


జెనెటిక్‌ వ్యాధులతో బాధపడే పిల్లలకు లైఫ్‌టైమ్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా పిల్లల డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు ఈ జబ్బును గుర్తిస్తారని అంటున్నారు. నిలోఫర్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి పిల్లలు నిమ్స్‌కు వస్తారని అంటున్నారు. పిల్లల బరువు, వయస్సును బట్టి చికిత్సలు అందించాల్సి ఉంటుందన్నారు. పాంపే డిసీజ్‌ వంటి జబ్బుతో బాధపడే చిన్నారులకు గుండె, కాలేయంలో వాపు వస్తుందని అంటున్నారు. దీని వల్ల పిల్లలకు గుండె వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. పుట్టిన ఏడాది నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు ఈ జెనెటిక్ జబ్బులు వస్తాయని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa