ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 07:27 PM

టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నోవాటెల్‌లో ఈ ఈవెంట్‌గా ఫ్లాన్ చేయగా.. పరిమితికి మించి అభిమానులు రావడంతో అది రద్దయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరిగారు.ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణంగా తెలంగాణ ప్రభుత్వమే అని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవటం వల్లే కార్యక్రమం రద్దయిందని చెబుతున్నారు. తాజాగా.. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.


తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమించామని చెప్పారు. నగరంలో చిన్న వేడుక జరిగినా.. మంత్రులంతా మానిటరింగ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూసేవారమని చెప్పారు. ఫార్ములా వన్ రేసులు, మెుహరం ఊరేగింపులు, బోనాలు, గణేష్ శోభాయాత్రలు ఇలా ఏ ఈవెంట్ అయినా చిన్న మచ్చ రాకుండా శాంతియుతంగా నిర్వహించేవారమని వెల్లడించారు. సినిమా ఈవెంట్లు కూడా సక్సెస్ చేసినట్లు చెప్పారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ఈవెంట్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించలేని అసమర్థత ఈ ప్రభుత్వానిదని మండిపడ్డారు. నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని.. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు.


అంతకు ముందు హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్టీపీలను కేటీఆర్ సందర్శించారు. మొదట కూకట్‌పల్లి ఫతేనగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టీపీని సందర్శించారు. హైదరాబాద్ నగరాన్ని మురికి నీటి రహిత నగరంగా మార్చేందుకు గత ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. అందులో భాగంగానే రూ.3,866 కోట్లతో భారీ ఎత్తున మురిగినీటి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే మురుగు నీటిని 100% శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ ఘనత సాధిస్తుందన్నారు.


అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీపీల నిర్మాణంలో వేగం తగ్గిందన్నారు. అన్ని సిద్ధంగా ఉన్నా.. ప్రాజెక్టుని వేగం తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీరు మూసీకి వెళ్తున్నప్పుడు మళ్లీ మూసీ నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఈ మూసీ నది ప్రక్షాళనపై అనేక అవినీతి తాలూకు అనుమానాలు వస్తున్నాయన్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయమనే తీరు నడుస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అన్నలకు ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం నడుస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పేదల ఇల్లు కూలకొట్టినా.. బాధితులకు నగరంలో తాము కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa