భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారకూడదని తాము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. భారతదేశ భద్రతకు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం కోసం బంగ్లాదేశ్ స్థిరత్వం అత్యంత ముఖ్యమని అన్నారు.బంగ్లాదేశ్తో సత్సంబంధాలను పునరుద్ధరించడం ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నిజమైన పరీక్ష అని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో కొన్ని శక్తులు అరాచకంగా మారాయని అన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం తర్వాత మన విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడకి వెళ్లారని గుర్తు చేశారు.భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు తమ దేశం మధ్యవర్తిత్వం వహించిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్న అంశంపై అసదుద్దీన్ ఒవైసీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఇండో-పాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా బదులు ఇవ్వాలని అన్నారు. మన దేశ హుందాతనాన్ని, సార్వభౌమత్వాన్ని చైనా తక్కువ చేసి మాట్లాడడం సరికాదని అన్నారు.ఆపరేషన్ సిందూర్ వేళ ఇండో-పాక్ మధ్య తీవ్ర సంక్షోభం నెలకొన్నదని, వాణిజ్య బెదిరింపులతో శాంతి నెలకొల్పినట్లు ట్రంప్ చెప్పారని, ఇప్పుడు చైనా మంత్రి కూడా ఇలాంటి ప్రకటన చేయడం భారత్ను కించపరచడమే అవుతుందని ఆయన అన్నారు. చైనా వ్యాఖ్యలను భారత్ బలమైన రీతిలో ఖండించాలని అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలను ఒకేస్థాయిలో పెట్టి, దక్షిణాసియాలో మేటి దేశంగా మార్కులు కొట్టేసేందుకు చైనా ప్రయతిస్తోందని అన్నారు.చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్నే అంగీకరించారా అని నిలదీశారు. ఇండో-పాకిస్థాన్ యుద్ధాన్ని మధ్యవర్తిత్వం ద్వారా ఆపినట్లు చైనా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ఖండించాలని, మూడవ దేశం జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa