హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను రక్షించటమే లక్ష్యంగా ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లు దండెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో.. కొన్ని ప్రాంతాల్లో సామాన్యులు నిర్మించుకున్న కట్టడాలు కూడా ఈ బుల్డోజర్ ఆపరేషన్లో నేలమట్టం అవుతున్నాయి. అయితే.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టిన హైడ్రాపై.. మొదట్లో అభినందించినవారే ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుండటం గమనార్హం. అందుకు కారణం.. సామాన్యులపైకి బుల్డోజర్లను ఎక్కుపెట్టటమే. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇందులో భాగంగా.. ఈ హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. నగరంలో చెరువులు లేకపోతే.. వరదలు వచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఇటీవల.. ఏపీలోని విజయవాడం నగరం వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్లోనూ ఏర్పడే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
నదీ గర్భంలో ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారని.. వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అయితే.. హైదరాబాద్లో కూల్చివేతల విషయంలో... పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి.. వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చార. ప్రభుత్వం ఆస్తులు కాపాడడం సర్కారు బాధ్యత అని.. అందులో భాగంగానే చెరువులను రక్షించి.. భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. వందల చెరువులు కనపడకుండా పోయాయని.. కనీసం ఉన్న చెరువుల్లో అయినా నిర్మాణాలు జరగకుండా అయినా ఆపాలనేది తమ ప్రభుత్వ ప్రయత్నమని చెప్పుకొచ్చారు.
మూసీ నదిలో మంచినీరు పారించటమే కాకుండా.. మంచి మంచి పార్కులు నిర్మించాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని భట్టి విక్రమార్క పంచుకున్నారు. మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాధితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వటమే కాకుండా.. వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని వివవరించారు.
హైదరాబాద్ అంటేనే.. లెక్స్..రాక్స్.. పార్క్స్ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. లెక్స్లో ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. అయితే.. ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలనే కూల్చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల కూల్చివేతలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే.. మూసీలో కూడా ఇండ్లు కట్టుకున్నారని తెలిపిన భట్టి విక్రమార్క.. అది వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదని తెలిపారు. మూసీలో ఇండ్లు ఉన్నవారికి బయట డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని భట్టి విక్రమార్క మరోసారి క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa