ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్.. నీ ఇల్లు చెరువు కుంటల ఉన్నది.. సుద్దపూస మాటలాపి దాన్ని కూలగొట్టు: హరీష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 07:19 PM

హైడ్రా కూల్చివేతలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్‌, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ పేదలకు ఇండ్లు లేకుండా చేయడటమే రేవంత్‌ లక్ష్యంగా ఉందన్నారు.


కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కట్టుకున్న ఇల్లు చెరువు కుంటలో ఉందని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని వాటిని కూల్చి ఆ తర్వాత పేదల ఇండ్ల జోలికి రావాలన్నారు. రేవంత్ రెడ్డి ఏదో సుద్దపూసలెక్క మాట్లాడుతుండు. కొండగల్‌లో ఆయన కట్టుకున్న ఇల్లే చెరువు కుంటల ఉన్నది. రెడ్డి కుంటలో సర్వే నెంబర్ 1138లో రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది. ఫస్టు నీ ఇల్లు కూలగొట్టుకో.. నీ ఇల్లు రెడ్డి కుంటల.. నీ తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నది. నీ తమ్మునికో రూల్.. నీకో రూల్.. గరీబోళ్లకో రూలా..? అని హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.


హైడ్రా కూల్చివేతల పేరుతో నగర ప్రజల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహిస్తుందని హరీష్ మండిపడ్డారు. కూల్చివేతలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయటంపై కాంగ్రెస్‌ దృష్టి సారించాలని హితవు పలికారు. మూసీని ఆక్రమించి భవనాలు కట్టినవారిని అడ్డుకోవట్లేదని.. పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్లు పంపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనను వదలేసి.. ఈ బుల్డోజర్‌ రాజకీయాలేంటని ప్రశ్నించారు. కూల్చివేతలను ఉపేక్షించేంది లేదని.. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని హెచ్చరించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెప్పారు. రేవంత్ సర్కార్ మీ ఇండ్లు ముట్టుకోకుండా తామే ఒక రక్షణ కవచంలా నిలబడతామని భరోసా ఇచ్చారు. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు.


అంతకు ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. మూసీలోకి మురికి నీరు రాకుండా చేయాలన్నారు. మూసీలోకి గోదావరి నీళ్లను తెస్తామని రేవంత్ అంటున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే గోదావరి నీళ్లను మూసిలోకీ తెస్తామంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలి పోయిందని మాట్లాడిన రేవంత్.. నేడు గోదావరి నీళ్లను మూసీలోకి ఎలా తీసుకోస్తారని ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa