ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో స్టేషన్ మూసీలోనే ఉంది కదా.. కూల్చేస్తారా..?,,,మీడియా ప్రతినిధి ప్రశ్న దాన కిశోర్ రిప్లై ఇదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 07:23 PM

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు దండయాత్ర చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, సామాన్యులు ఇలా.. ఎవ్వరు అక్రమ కట్టడాలు నిర్మించినా.. ఏ ఒక్కరినీ ఉపేక్షించకుండా.. అందరిపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తోంది హైడ్రా. అయితే.. ఈ హైడ్రా కూల్చివేతల్లో కొంత మంది సామాన్య ప్రజలకు సంబంధించిన నిర్మాణాలు ఉండగా.. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ.. ముందు అభినందించిన వాళ్లే తిట్టిపోసే పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో.. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూడా కూల్చేసే ప్రక్రియ మొదలైంది. దీంతో.. సోషల్ మీడియా వార్తలపై, ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.


ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో.. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఇద్దరు అధికారులు సమాధానాలు ఇస్తూ.. ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే.. ఓ మీడియా ప్రతినిధి.. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌ గురించి ప్రశ్న సంధించారు. "ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కూడా.. మూసీలోనే ఉంది కదా.. మరి దాన్ని కూడా కూల్చేస్తారా..? ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆక్రమణలన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు కదా.. మరి ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?" అంటూ ప్రశ్నించాడు.


ఈ ప్రశ్నకు దాన కిషోర్ సమాధానం ఇచ్చారు. "ఇదీ చాలా సీరియస్ ప్రశ్న.. మా వద్దకు వచ్చిన ఎన్జీవోలు కూడా ఇదే ప్రశ్న అడిగారు. దీనిపై పైస్థాయిలో చర్చిస్తాం. తప్పనిసరిగా చర్చించి తగురీతిలో స్పందిస్తాం." అని దాన కిషోర్ సమాధానం చెప్పారు. అయితే.. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. "నిజంగా.. ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ను కూల్చేస్తారా.. అలా అయితే.. మెట్రో రైల్ అలైన్ మెంట్ మళ్లీ మార్చాల్సి ఉంటుంది. దీని వల్ల చాలా డబ్బు మూసీలో పోసినట్టేనని.. అదనంగా భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.." అంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి.


ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ కోసమే కాదని.. దాని వెనుక పెద్ద లక్ష్యం ఉందని దాన కిషోర్ వివరించారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు.. మూసీ గేట్లు తెరిచినప్పుడు పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించటమనేది రెగ్యూలర్‌గా జరిగే ప్రక్రియ అని తెలిపారు. అలా కాకుండా.. అలాంటి వారందరికీ శాశ్వత పునవారావాసాలు కల్పించనున్నట్టు దాన కిషోర్ తెలిపారు. ఈ మూసీ ప్రాజెక్టు వల్ల ఇండ్లు కోల్పోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. పట్టాలున్న బాధితులకు 20 నుంచి 30 లక్షల విలువైన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వనున్నట్టు దాన కిషోర్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa