ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. దసరాకు ఇలా అయితే కష్టమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:47 PM

కొందరు నాన్‌వెజ్ ప్రియులకు ముక్కలేనిదే ముక్క దిగదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నీచు ఉండాల్సిందే. ఇక తెలంగాణలో అయితే.. ప్రతి చిన్న కార్యానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా మాసంతోనే భోజనాలు పెడుతుండారు. అయితే మాంసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్‌న్యూసే. ఎందుకంటే చికెన్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత కొంతకాలం వరకు తక్కువగా ఉన్న చికెన్ ధరలు.. మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. ఈనెల ప్రారంభంలో కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.160-180 మధ్య పలికింది.


గత రెండు వారాల క్రితం అది రూ.200 మార్క్ దాటింది. గత వారం కేజీ చికెన్ రూ.230 పైగా ఉండగా.. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.240 పైనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 250 పైగా కూడా అమ్ముతున్నారు. దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చికెన్ రేట్లు మరింత పెరిగితే ఈసారి పండగ కష్టమేనని నాన్ వెజ్ ప్రియులు అంటున్నారు. ఇప్పటికే మాంసం ప్రియులు చికెన్ కొనలేక.. తినలేక తమ జిహ్వాచాపల్యాన్ని చంపుకుంటున్నారు. పండక్కి కూడా ఇదే ధరలు ఉంటే ఇబ్బందే అని చెబుతున్నారు.


ఇక కూరగాయలు నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ సన్ ఫ్లవర్ ఆయిల్ పది రోజుల క్రితం రూ.115 వరకు ఉండగా.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కేజీ రు. 160-170 మధ్య అమ్ముతున్నారు. దిగుమతి సుంకం పెంచటంతో నూనెల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇక కూరగాయల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ టమాట ప్రస్తుతం రూ. 50 వరకు పలుకుతోంది. ఉల్లి ధర కేజీ రూ.60 వరకు ఉంది.


పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కూరగాయల మార్కెట్‌కు వెళితే.. వెయ్యి పదిహేను వందలు పెట్టనిదే కూరయాల సంచి పూర్తిగా నిండటం లేదు. దసరా పండక్కి కూడా ఇలాగే ధరలు ఉంటే పండగ చేసుకున్నట్లేనని సామాన్యులు నిట్టూరుస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa