ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:56 PM

ఫొటో ట్రోలింగ్‌తో మొదలైన వివాదం.. వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ వైపు మళ్లింది.. నాగచైతన్య, సమంతా విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి..ప్రత్యర్థులను టార్గెట్‌ చేయబోయి… ఇండస్ట్రీని లింక్‌ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోనే కాదు,దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ… బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో.. అక్కినేని కుటుంబంతో లింక్‌పెడుతూ చేసిన కామెంట్స్‌ చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది.. తమను పలుచన చేసి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది టాలీవుడ్. అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు.. రంగానికి చెందిన నటులు, డైరెక్టర్లు, నిర్మాతలంతా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలోనే.. తాను చేసిన కామెంట్స్‌పై నటి సమంతకు క్షమాపణ చెప్పారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్‌ను మాత్రమే తాను విమర్శించానని..ఆ సందర్భంలో అనుకోకుండా సమంత పేరు తీసుకున్నానని విచారం వ్యక్తం చేశారు. అయితే.. మినిస్టర్‌పై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేయడంతో.. వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అయితే.. ఈ విషయం రెండు రోజులైనా ఇంకా చల్లారడం లేదు.. అటు రాజకీయంగానూ.. ఇటు సినీ ఇండస్ట్రీ పరంగానూ హీటెక్కిస్తోంది.. ఈ తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఒంటరి అనుకోకండి.. అంటూ బలమైన మెస్సెజ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.


 


వాళ్ల ఎపిసోడ్‌లో.. సంయమనం పాటించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా.. వాళ్లు చర్చ కొనసాగించారని వివరించారు. కొండా సురేఖను అవమానిస్తూ పెట్టిన పోస్టులపైనా.. వాళ్లు స్పందిస్తే బాగుండేదని.. మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆవేదనలో మంత్రి మాట్లాడారు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా ఇంత దాడి అవసరమా ? అంటూ ప్రశ్నించారు.. బలహీనవర్గాలకు చెందిన మంత్రి కొండా సురేఖ ఒంటరి అనుకోకండి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇదిలాఉంటే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో అక్కినేని నాగార్జున కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా వేశారు.. దీనిపై సోమవారం విచారణ జరగనుంది..


 


కేటీఆర్ సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇప్పటికే మంత్రిపై ఇప్పటికే పరువు నష్టం దావా వేశానన్న కేటీఆర్‌… సీఎం మీద కూడా త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానంటూ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa