హైదరాబాద్లో అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా.. ఇక నుంచి టాప్ గేర్లో దూసుకుపోనుంది. ఇప్పటికే.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లి నేలమట్టం చేయగా.. ఇప్పుడు ఆ హైడ్రాకు ప్రభుత్వం చట్టబద్దత కల్పిస్తూ మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది. ఈ క్రమంలోనే.. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు శనివారం (అక్టోబర్ 05న) రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అంతకుముందు.. హైడ్రా ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారు. దీంతో.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైడ్రా ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర వేశారు. జీహెచ్ఎంసీ చట్టంలో సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపగా.. ఇప్పటికే అమల్లో ఉన్న చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని పనులకు చట్టబద్ధత లభించినట్టయింది. కాగా.. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయనున్నారు. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా మారనుంది.
అయితే.. హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా.. రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జులై 19వ తేదీన ఈ హైడ్రాను జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పాటు చేశారు. ఈ జీవో నెంబర్ 99 ప్రకారం.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పరిధిలో.. ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చింది ప్రభుత్వం. ఆ తర్వాత హైడ్రాకు క్రమంగా అధికారాలను పెంచుకుంటూ వచ్చింది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలతో పాటు సిబ్బందిని కూడా అదే స్థాయిలో నియమించాలని నిర్ణయించింది. ఈమేరకు 169 మంది అధికారులను నియమించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే.. హైడ్రా చేపట్టిన కూల్చివేతల నేపథ్యంలో చాలా మంది బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. హైడ్రాకు ఉన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ధర్మాసనం ప్రశ్నించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. హైడ్రాకు ఆర్డినెన్స్కు గవర్నర్ కూడా ఆమోదించటంతో.. ఇకపై హైడ్రా మరింత దూకుడు ప్రదర్శించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa