ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగట్టుకు టీటీడీ తీపికబురు.. నెరవేరనున్న అంజన్న భక్తుల కల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 10:04 PM

కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుల ఏళ్లనాటి కల నెరవేరబోతోంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. అదేంటీ.. కొండగట్టు అంజన్న భక్తుల కల నెరవేరటానికి.. టీటీడీ శుభవార్త చెప్పటమేంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్న. టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో దేశంలోని పురాతన ఆలయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే.. అంజన్న భక్తుల కోరిక మేరకు 100 గదులను నిర్మించేందుకు టీటీడీ ముందుకొచ్చింది.


ఈ క్రమంలోనే.. ఈ గదుల నిర్మాణం కోసం టీటీడీ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు ఆలయ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు ఆలయ ఈవో స్థలాన్ని చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సత్యం.. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం.. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఇస్తామని ఆశపెట్టి అంజన్న భక్తులను మోసం చేసిందని మండిపడ్డారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముంఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. త్వరలోనే.. టీటీడీ ఆధ్వర్యంలో 100 గదుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. గదుల నిర్మాణంతో పాటు.. అరుణాచలం మాదిరిగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ సేవను ప్రారంభించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. ఇందు కోసం త్వరలోనే రూట్ మ్యాప్‌ కూడా ఖరారు చేయనున్నట్టు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పుకొచ్చారు.


 ఇదిలా ఉంటే.. కొండగట్టు మీద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం 400 ఏళ్ల క్రితమే నిర్మితమైనట్టుగా.. చరిత్ర చెప్తోంది. అక్కడ ఆంజనేయుడు స్వయంభువుడిగా వెలిశాడని పెద్దలు చెప్తుంటారు. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిసరాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి సాక్షాత్కారం అయినట్టుగా చెప్పుకుంటుంటారు. అలాంటి ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ వాసులకు కొంగు బంగారంగా వెలుగొందుతోంది. అయితే.. ఇన్నాళ్లు అరకొర వసతులతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనగా.. ఇప్పుడు భక్తుల కోసం గదులు నిర్మాణం చేపడుతుండటంతో.. ఎన్నో ఏళ్ల కల నెరవేరుతున్నట్టయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa