హైదరాబాద్వాసులకు సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది. నగరవాసులకు మరోసారి ఓటీఎస్ (One Time Settlement) స్కీంను అమల్లోకి తీసుకొచ్చింది వాటర్ బోర్డు. దీర్ఘకాలంగా పెండిగ్లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం ఈ ఓటీఎస్ పథకంతో చక్కటి అవకాశాన్ని మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. దసరా పండుగను పురస్కరించుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని నెల రోజుల పాటు అంటే అక్టోబర్ 01 నుంచి 31వ తేదీ వరకు అమలు చేయనున్నారు. అయితే.. బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ వాటర్ బోర్డులో నీటి బకాయిలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. వాటిని తగ్గించేందుకు వాటర్ బోర్డు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు.. మరోసారి ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) పథకాన్ని అమలు చేయాలని సెప్టెంబర్ 19వ తేదీన రేవంత్ రెడ్డి సర్కారుకు వాటర్ బోర్టు లేఖ రాసింది. వాటర్ బోర్డు లేఖపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. ఓటీఎస్ అమలుకు అనుమతిస్తూ.. తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. దీంతో.. ఓటీఎస్ కింద వినియోగదారులు ఎలాంటి ఫైన్, వడ్డీ లేకుండా బకాయిలను చెల్లించే సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చినట్టయింది.
ఈ ఓటీఎస్ పథకాన్ని గత ప్రభుత్వం.. 2016లో ఒకసారి.. మళ్లీ 2020లో మరోసారి వాటర్ బోర్డ్ అధికారులు అమలుచేశారు. ఈ పథకం అమలు చేయటం వల్ల.. ఒక్కో విడతలో రూ.400 కోట్లకు పైగానే బకాయిలు వసూలయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అయితే నీటి బిల్లుల బకాయిలపై ఉన్న వడ్డీని మాఫీ చేసేందుకు.. అధికారుల స్థాయిని బట్టి పరిమితిని నిర్ణియించింది ప్రభుత్వం.
మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు వడ్డీని మాఫీ చేసేందుకు అనుమతించగా.. డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న అధికారులు రూ.10,001 నుంచి లక్ష వరకు మాఫీ చేయొచ్చని పరిమితి విధించారు. ఇక.. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న అధికారులు.. రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువే మాఫీ చేసే అధికారాలను ప్రభుత్వం కల్పించింది. అయితే.. హైదరాబాద్ వాసులంతా ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాటర్ బోర్డు ఎండీ ఆశోక్ రెడ్డి వినియోగదారులకు సూచించారు.
అసలు ఓటీఎస్ నిబంధనలు ఏంటంటే..?
ఓటీఎస్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
నల్లా కనెక్షన్ యాక్టివ్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది.
గతంలో ఓటీఎస్ను వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే అలస్య రుసుము, వడ్డీ మాఫీ అవుతాయి.
ఒకవేళ గతంలో ఓటీఎస్ను వినియోగించుకుంటే 50 శాతం మాఫీ అవనుంది.
ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వారు భవిష్యత్తులో 24 నెలల పాటు క్రమంగా బిల్లులు చెల్లిస్తామని ఆఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa