ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 06:41 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో.. కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏలో మనీ లాండరింగ్‌‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటివలే నోటీసులు జారీ చేశారు. మంగళవారం (అక్టోబర్ 08న) రోజున విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. నోటీసులకు స్పందించిన అజారుద్దీన్.. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.


2020-2023 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సుమారు రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేశారంటూ అజారుద్దీన్ మీద ఈడీ అభియోగం మోపింది. హెచ్‌సీఏ ఆడిట్‌లో కూడా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆధారాలను కూడా ఈడీ బయటపెట్టడం గమనార్హం. ఈ కేసులో అజారుద్దీన్‌కు ఇప్పటికే ముందస్తు బెయిల్‌ మంజూరైంది.


కాగా.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా.. డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లలో దాదాపు రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా హెచ్సీఏ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలోనే.. గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ.. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.


సంస్థ పనితీరును పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్డి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. పనితీరుతో పాటు హెచ్‌సీఏలో నెలకొన్న సమస్యల పరిష్కారం.. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కూడా కోర్టు ఆయనకే కట్టబెట్టింది. అయితే.. హెచ్‌సీఏ అభ్యర్థన మేరకు మార్చి 2020, ఫిబ్రవరి 2023 మధ్య జరిగిన నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్‌లో.. ప్రైవేట్ ఏజెన్సీలకు నిధుల మళ్లింరు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో.. ఈ వ్యవహారంపై హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే.. 2023 అక్టోబర్‌లో అజారుద్దీన్‌పై హైదరాబాద్ పోలీసులు 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విశ్వాస ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ, కుట్ర లాంటి అభియోగాలను అజారుద్దీన్‌పై మోపారు.


ఈ అభియోగాలపై అజారుద్దీన్ స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగిందని అజారుద్దీన్ ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత ఆరోపణ అని వ్యాఖ్యానించారు. అజారుద్దీన్‌పై కేసు నమోదవటంతో.. ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 నవంబర్‌లో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.


ఈ క్రమంలో.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ జరిపారు. ఈ విచారణంలో భాగంగా హెచ్‌సీఏ మాజీ ఆఫీస్ బేరర్లు గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌ల ఇళ్లతో సహా.. తెలంగాణలోని తొమ్మిది ప్రదేశాలలో ఈడి సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలు, లెక్కల్లో చూపని నగదు రూ.10.39 లక్షలు లభించాయి. దీంతో.. విచారణకు హాజరుకావాలంటూ అజారుద్దీన్‌కు ఈడీ సోటీసులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa