ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఉద్దేశంతోనే నా ఫ్యామిలీపై కొండా సురేఖ తప్పుడు వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున స్టేట్‌మెంట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 06:40 PM

అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే.. ధర్మానసం ఆదేశాల మేరకు.. నేడు (అక్టోబర్ 08న) నాగార్జున నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నాగార్జున వెంట.. ఆయన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో పాటు సుప్రియ, నాగ సుశీల, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మంత్రి కొండా సురేఖపై ఎందుకు పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది. ఈ క్రమంలో.. నాగచైతన్య, సమంతల విడాకులపై, తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ధర్మాసనానికి నాగార్జున వివరించారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.


మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వకమైన తప్పుడు వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి నాగార్జున తెలిపారు. నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. సినీరంగంలో ఉన్నవారిపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదని నాగార్జున తెలిపారు.


సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. దేశ వ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని ధర్మాసననానికి నాగార్జున వివరించారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని కూడా తెలిపారు. సినిమా రంగంతో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే తన కొడుకు విడాకులు తీసుకున్నాడంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని ధర్మాసనం ముందు నాగార్జు ఆవేదన వ్యక్తం చేశారు. అలా మాట్లాడం వల్ల తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని తెలిపారు.


రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ తమపై తప్పుడు ఆరోపణలు చేశాని నాగార్జున ఆరోపించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ప్రసారమైందని ధర్మాసనానికి తెలిపారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున కోరారు. ఈమేరకు నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు రికార్డు చేసింది.


నాగార్జున వాంగ్మూలంతో పాటు మొదటి సాక్షిగా యార్లగడ్డ సుప్రియ స్టేట్‌మెంట్లను కూడా కోర్టు రికార్డు చేసింది. నాగ చైతన్య, సమంత.. మాజీ మంత్రి కేటీఆర్ వలనే విడాకులు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ మాట్లాడారని.. సుప్రియ తెలిపారు. ఎన్-కన్వెన్షన్ విషయంలో సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదని.. అందుకే విడాకులు తీసుకుందని.. మంత్రి మాట్లాడారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు విని తమ కుటుంబం మొత్తం షాకయ్యామన్నారు. మంత్రి తమ కుటుంబంపై ఎందుకు ఇలా మాట్లాడారో తమకు అర్ధం కాలేదన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు తాను కొన్ని మీడియాలలో చూశానని.. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్త విన్నానని సుప్రియ తెలిపారు. మరుసటి రోజు పేపర్లో సైతం వార్త వచ్చిందని చెప్పుకొచ్చారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని సుప్రియ తెలిపారు. సుప్రియ వాంగ్మూలం రికార్డు చేసుకున్న తర్వాత.. విచారణను ఎల్లుండి (అక్టోబర్ 10)కి వాయిదా వేసింది ధర్మాసం. కాగా.. మరో సాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని ఎల్లుండి రికార్డు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa