తెలంగాణ వాసులకు వరుసగా గుడ్ న్యూసులు చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు కసరత్తు షురూ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ.. తెలంగాణలో రూ.1200 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపునకు.. ప్రభుత్వ అనుమతి కోరుతూ డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. హైటెన్షన్ కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు.. లోటెన్షన్ ఛార్జీల పెంపు పేరుతో డిస్కంలు ప్రతిపాదలు పంపించటం గమనార్హం. హైటెన్షన్ కేటగిరీకి ఛార్జీల పెంపుతో రూ.700 కోట్లు.. ఫిక్స్డ్ ఛార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఇదిలా ఉంటే.. మరో రూ.400 కోట్లను లోటెన్షన్ కేటగిరి విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ ఛార్జీల పెంపుతో రాబట్టుకోనున్నట్టు ప్రతిపాదనల్లో డిస్కంలు పేర్కొన్నాయి.
డిస్కంలు ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలను బట్టి చూస్తుంటే.. రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ డిస్కంలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. విద్యుత్ ఛార్జీలు పెరిగి.. సామాన్యుల జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. తెలంగాణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగి ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంగా.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు గుదిబండగా మారనుంది.
అయితే.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలపై కోట్ల రూపాయల భారం మోపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. డిస్కంలు పంపించిన విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను బీఆర్ఎస్ నేతలు కోరారు.
మరోవైపు.. ఒకేసారి ప్రజలపై ఇంత భారం మోపడం దారుణమని కేటీఆర్ తన వాదన వినిపించారు. సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక రంగానికి చెందిన అన్ని కేటగిరీలకు ఒకే ధర నిర్ణయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీని వల్ల ఎంఎస్ఎంఈలపై తీవ్ర భారం పడనుంది. ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో గృహ వినియోగదారులపై భారం మోపటం సరికాదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 పిటిషన్లపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. మండలి ఛైర్మన్ శ్రీరంగారావుతో పాటు సభ్యులైన ఎండీ మనోహర్ రాజు, కృష్ణయ్య పదవీకాలం అక్టోబర్ 29వ తేదీతో ముగియనుంది. దీంతో.. వాళ్ల పదవీకాలం ముగిసేలోపే ఈఆర్సీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే డిస్కంల ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. నవంబర్ ఒకటో తారీఖు నుంచే ఛార్జీల మోత మోగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa