ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో.. ఎమోషన్స్ విషయంలో అంతే వీక్గా ఉంది. చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు పిల్లలు. వాళ్లు వేస్తోంది తప్పటడుగు అని పెద్దలు కొంచెం మందలించినా తీసుకోలేకపోతున్నారు. ఫోన్లు ఎక్కువ చూడొద్దని చెప్పినందుకు.. మొబైల్ కొనివ్వలేదని.. ఇలా చిన్న చిన్న విషయాల్లో తల్లిదండ్రులు మందలించినా.. మనస్తాపంతోనో, కోపంతోనో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేద్దామనో కానీ.. ఇండ్లలో నుంచి వెళ్లిపోవటం.. ఆత్మహత్యకు యత్నించటం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి కూడా.. తోటి విద్యార్థుల ముందు ప్రిన్సిపల్, తండ్రి తనను కొట్టారని తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో శనివారం (అక్టోబర్ 26న) చోటుచేసుకుంది.
శభాష్ గూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల్లో 8వ తరగతి చదువుకుంటున్నాడు. శుక్రవారం(అక్టోబర్ 25న) రోజున పాఠశాల్లో జరిగిన ఓ పరీక్షలో.. సదరు విద్యార్థి కాపీ కొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్.. విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఈ విషయాన్ని ఆ విద్యార్థి తండ్రికి కూడా కంప్లైంట్ చేశారు. దీంతో.. ఆ విద్యార్థి తండ్రి నేరుగా పాఠశాలకు రావటమే కాకుండా.. స్కూల్లోనే మిగతా విద్యార్థుల ముందే కొట్టాడు. ప్రిన్సిపల్తో పాటు తండ్రి కూడా చేయిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆ విద్యార్థి.. తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.
శనివారం (అక్టోబర్ 26న) ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లిన విద్యార్థి.. అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన కొందరు విద్యార్థి ఉరేసుకున్న విషయాన్ని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకోగా.. అప్పటికే విద్యార్థి కన్నుమూశాడు. దీంతో.. మృతదేహాన్ని కిందికి దింపి... పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa