తెలంగాణలోని నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై రాష్ట్ర రెవెన్యూ, గహ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మరో అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి సర్వం సిద్ధమైందని.. ఇక లబ్దిదారుల జాబితాను ప్రకటించటమే మిగిలిందంటూ.. గత కొంతకాలంగా చెప్తూ వస్తున్న మంత్రి పొంగులేటి.. మరో కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ను రూపొందించినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం (అక్టోబర్ 26న) రోజున మీడియా సమావేశం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.
ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ను సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. యాప్లో చేయాల్సిన మార్పులకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేసి తరువాతి వారంలో యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు మరోసారి తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ తెలుగులో ఉండాలని సూచించినట్టు చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలందరికి సొంతింటి కలను సాకారం చేయాలన్న ధ్యేయంతో.. అర్హులైనవారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖాళీ స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక.. ఖాళీ స్థలం లేనివారికి స్థలంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని.. ఆశావాహులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa