తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోపణలు చేసింది. సీఎం రేవంత్ సహా.. మంత్రులు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్టై విచారణ ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే.. రివర్స్ ఎటాక్లో సీఎం రేవంత్పై మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంతమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాలు స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలన్నారు. తెలంగాణలో మంత్రులతో పాటు తన ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పాలన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అక్కడ రాహుల్ గాంధీ డెమోక్రసీ అది ఇది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పిల్లల మీద ఆ పార్టీ సీఎం రేవంత్ కేసులు పెడుతున్నాడని ఆక్షేపించారు. బుల్డోజర్లను ఎలా అడ్డుకోవాలి.. పార్టీ క్యాడర్ను ఎలా కాపాడుకోవాలనేది తమ మొదటి బాధ్యత అని చెప్పారు. మళ్లీ ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలనేదానిపై కసర్తత్తు చేస్తున్నామన్నారు.
ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపైనా స్పందించారు. కేసీఆర్ జీవితంలో చాలా చూశారని.. ఇలాంటి ఓటమికి ఆయన భయపడరని చెప్పారు. కేసీఆర్ ఎలాంటి షాక్లో లేరని.. అనునిత్యం తెలంగాణ గురించి మాత్రమే ఆలోచిస్తారని చెప్పారు. ఆయన తెలంగాణ కోసం మాత్రమే ఆందోళన చెందుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారం కోసం కాదని.. తెలంగాణ బాగు కోస మాత్రమేనని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa