జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా తాటి చెట్టుకు, ఈత చెట్టుకు కల్లు రావటం చూశాం. కానీ.. ఇక్కడ మాత్రం చింత చెట్టుకు కల్లు వస్తోంది. ఇదెక్కడి మాయ అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదువుతున్నది నిజమే. ఎండపల్లిలోని ఓ కూడలి వద్ద సుమారు వందేళ్లకు పైగా వయసున్న చింత చెట్టు ఉంది. ఉన్నట్టుండి ఆ చెట్టు నుంచి రెండు రోజులుగా కల్లు కారుతోంది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు.. ఆసక్తిగా చూస్తున్నారు. అయితే.. ప్రతి సంవత్సరం ఇదే చింత చెట్టు కింద వినాయకుడి విగ్రహంతో పాటు దుర్గా మాత విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు.
అయితే.. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే.. వినాయక చవితి, దసరా నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసేందుకు చింత చెట్టు కొమ్మలను నరికేశారు. అయితే.. ఈ కొమ్మలు కొట్టేసి.. సుమారు 20 రోజులు అవుతుండగా.. ఆ కొట్టేసిన ప్రాంతాల్లో రెండు రోజులుగా కల్లు లాంటి తెల్లటి నీళ్లు వస్తున్నాయి. అది చూసిన జనాలు.. చెట్టు కొమ్మకు ప్లాస్టిక్ బాటిల్ కట్టారు. దీంతో.. కళ్లులాగానే బాటిల్ మొత్తం తెల్లని ద్రవం నిండింది. ఈ విషయం గ్రామం మొత్తం వైరల్ కావటంతో.. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
ఇది చూసిన జనాలు.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే.. చింత చెట్టుకు కల్లు పారుతుందని చర్చించుకుంటున్నారు. మరికొంత మంది.. కలియుగం అంతానికి సమయం దగ్గర పడిందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన పడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇదంతా దుర్గమ్మ మాయే అంటూ అభిప్రాయపడుతున్నారు.
గతంలోనూ ఇలాంటి వింత ఘటనలు రాష్ట్రంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. చెట్టు నుంచి నీళ్లు రావటం.. నంది విగ్రహం నుంచి నీళ్లు వస్తుండటం.. దేవుళ్ల విగ్రహాలు పాలు తాగుతుండటం లాంటి ఆసక్తికర ఘటనలు చాలానే వెలుగుచూశాయి. అయితే.. వాటన్నింటికీ శాస్త్రీయ కారణాలు బయటకు రాగా.. దీనికి కూడా కారణాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa