ట్రెండింగ్
Epaper    English    தமிழ்

46 ఏళ్ల నిరీక్షణకు 'ప్రజావాణి'తో పరిష్కారం.. ఆనందంలో పేద రైతు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 08:09 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం 'ప్రజావాణి' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజావాణిలో ప్రజల నుంచి అధికారులు వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి వాటికి పరిష్కారం చూపిస్తారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చే ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. వెంటనే స్పందించే అధికారులు వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తుంటారు.


తాజాగా.. ఓ పేద రైతు 46 ఏళ్ల నిరీక్షణకు ప్రజావాణిలో పరిష్కారం చూపించారు. ఎకరం సాగుభూమి పట్టాదారు పాస్‌ పుస్తకం ఏళ్లుగా నిరీక్షిస్తుండగా.. ఎట్టకేలకు పట్టా అందింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ డా.జి.చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ వివరాలు వెల్లడించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెదిన కొమ్మనబోయిన పిచ్చయ్య పేద రైతు. అతడికి గ్రామంలో ఎకరం సాగు భూమి ఉంది. అయితే ఆ భూమికి పట్టాదారు పాసు పుస్తకం లేదు.


పాసుపుస్తకం కోసం పిచ్చయ్య 1978 నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో గత జులైలో ప్రజాభవన్‌లో కొనసాగుతున్న 'ప్రజావాణి' కార్యక్రమానికి హాజరై.. తన గోడును వెళ్లబోసుకున్నాడు. పిచ్చయ్య నుంచి వివరాలు సేకరించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 100 రోజుల్లోనే భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకం అతనికి అందించారు. మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన పిచ్చయ్య.. అధికారుల చేతుల మీదుగా పాస్‌ పుస్తకాన్ని అందుకున్నారు.


సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో ఏర్పాటుచేసిన ప్రజావాణితోనే తన ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం దొరికిందని.. భూమి పాస్‌ పుస్తకం అందిందని పేద రైతు పిచ్చయ్య ఆనందం వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం (నవంబర్ 5) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 1,031 అఫ్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వాటికి పరిష్కార మార్గాలు చూపుతామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa