పుట్టిన రోజు సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (నవంబర్ 08న) యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి.. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోశ్చరణలతో రేవంత్ రెడ్డు కుటుంబానికి స్వామివారి ఆశీర్వాదంతో పాటు ప్రసాదం అందించారు. అనంతరం.. ఆలయ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై, పెండింగ్ పనులపై అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు.
ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు.
మరోవైపు.. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తుచేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇక నుంచి కూడా కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు.. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్తో రావాలని అదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో భక్తుల్లో సంతోషం నెలకొంది. గతంలో గుట్టపై నిద్ర చేస్తే సకల బాధలు పోతాయని నమ్మే భక్తులకు.. ఆ నిద్ర మొక్కులు చెల్లించుకునే సువర్ణావకాశం మళ్లీ కలగనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. టీటీడీ తరహాలో టెంపుల్ బోర్టు ఏర్పాటు చేస్తే.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని.. ఆలయ అభివృద్ధి కూడా టీటీడీ స్థాయిలో జరిగే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa